కేటీఆర్‌ పరిశ్రమల శాఖ మంత్రి కావడం మన అదృష్టం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్

 దండుమల్కాపూర్‌లో టీఎస్‌ఐఐసీ-టీఐఎఫ్-ఎమ్మెస్‌ఎంఈ-గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కు కోసం రైతులు తక్కువ ధరకు భూములిచ్చి పెద్ద మనసు చాటుకున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. భూసేకరణ విషయంలో తోడ్పాడునందించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.


మంత్రి కేటీఆర్‌ గ్రీన్ ఇండస్ట్ర్రియల్ పార్కును ప్రారంభించిన అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ..మునుగోడు ప్రజల తరపున మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ప్రజలు టీఆర్‌ఎస్‌ను నమ్ముతున్నరు కాబట్టే రెండోసారి అధికారం కట్టబెట్టారు. తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడ్తయని, మా జీవితాల్లో వెలుగు నింపుతయని ఎంతో ఆశతో కొన్ని లక్షల మంది యువకులు ఎదురుచూస్తున్నరు. అలాంటి యువకుల కోసం, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు చేపట్టిన కార్యక్రమం ఇదన్నారు. పారిశ్రామిక వేత్తలందరినీ ఈ వేదిక ద్వారా ఆహ్వానిస్తున్నామన్నారు. కేటీఆర్‌లాంటి అనుభవం, అవగాహన ఉన్న వ్యక్తి పరిశ్రమల శాఖ మంత్రి కావడం మన అదృష్టమని రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక మౌలిక వసతులతో గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌లో పరిశ్రమలు పెట్టేందుకు వస్తున్న వారికి ధన్యవాదాలు తెలియజేశారు.